నేను మూడోసారి అధ్యక్షుడిని!
- అమెరికా వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- బైడెన్ గెలుపు తనదేనంటూ వివాదాస్పద కామెంట్స్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తాను అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడంలో ఇది మూడోసారి అని చెప్పుకొన్నారు. నిజానికి ఆయన అధికారికంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారే అయినప్పటికీ.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ తన విజయాన్ని దోచుకున్నారని ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. ఆ ఎన్నికను కూడా తన ఖాతాలోనే వేసుకుంటూ.. ‘నిజానికి ఇప్పుడు నేను మూడోసారి అధ్యక్షుడిగా ఉన్నట్లు లెక్క. కానీ, వివాదాల జోలికి వెళ్లకూడదనుకుంటున్నాను కాబట్టి.. నేను అలా అనను’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూనే, అంతలోనే నవ్వుకుంటూ వివాదాస్పద అంశాల జోలికి పోవాలనుకోవట్లేదంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదిగిందంటే అది అనుకోకుండా జరిగిందేమీ కాదని, తాను మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు దేశ సైన్యాన్ని పునర్నిర్మించి, సైనిక సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతో కృషి చేశానని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, 2020 ఎన్నికల్లో పరాజయం పాలైన ట్రంప్.. తన ఓటమిని అంగీకరించకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఫలితాలను మార్చాలనే ఉద్దేశంతో పలు కీలక రాష్ట్రాల్లో వ్యాజ్యాలు దాఖలు చేసినప్పటికీ, తన ఆరోపణలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. మరోవైపు జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించకుండా అడ్డుకునేందుకు 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ భవనంపై జరిపిన దాడి అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీయగా.. ట్రంపే వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలు వచ్చాయని ఈ కథనంలో పేర్కొన్నారు.