‘మతిపోయిందా..?’ పాక్ మంత్రికి భారత్ కౌంటర్
- ప్రధాని మోదీపై పాక్ రక్షణ మంత్రి అనుచిత వ్యాఖ్యలు
- ఘాటుగా బదులిచ్చిన విదేశాంగ శాఖ
ద్వీపదేశమైన సీషెల్స్లో పర్యటించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ అందుకోవడంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా ప్రధాని మోదీ నిలవగా, మోదీ పర్యటనకు కొద్దివారాల ముందే (జూన్ 24న) సీషెల్స్ మంత్రివర్గం దీనికి అధికారికంగా ఆమోదం తెలిపింది. అయితే, ఇది కావాలని ఇప్పించుకున్న అవార్డు అంటూ ఖవాజా ఆసిఫ్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై భారత ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ రక్షణ మంత్రికి పనేమీ లేదని, అసూయ మరియు విద్వేషపూరిత ప్రసంగాలకు అలవాటుపడి మతి స్థిమితం లేకుండా, కనీస అవగాహన లేని అంశాలపై అర్థరహితంగా మాట్లాడుతున్నాడని విదేశాంగ శాఖ గట్టి చురకలు అంటించింది.
