కోటవురట్లలో మెగా పేరెంట్ – టీచర్స్
రూ.2.43 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన హోంమంత్రి
పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (vangalapudi Anitha) స్పష్టం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా నిధులు రూ.168.03 లక్షలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నూతన భవనంతో పాటు, రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయ నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న హోంమంత్రి అనిత
అనంతరం కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన ‘మెగా పేరెంట్స్–టీచర్స్’ (PTM) సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి అనిత, వారితో ఆప్యాయంగా ముచ్చటించి విద్యాబోధన, సదుపాయాలపై ఆరా తీశారు. స్థానిక విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల వద్ద బస్సు స్టాండ్ ఏర్పాటు చేయడంతో పాటు, అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు అదనంగా రెండు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
విద్యారంగంలో నారా లోకేష్ విప్లవాత్మక సంస్కరణలు
సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు అమలువుతున్నాయని, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు పడుతున్నాయని కొనియాడారు. బడిని దేవాలయంతో సమానంగా గౌరవించాలని, పాఠశాలల ఆవరణలో ఇతర కార్యక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘తల్లికి వందనం’ ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని వివరించారు.

విద్యార్థులతో హోంమంత్రి అనిత
గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలపై కఠిన వైఖరి
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, బాధ్యతాయుతంగా చదువుకోవాలని మంత్రి సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని, వారిని మానసికంగా ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాహనదారులు, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో త్వరలోనే అనేక పరిశ్రమలు రాబోతున్నాయని, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
