కుప్పంలో స్పెషల్ ఫోకస్ వెనుక అసలు వ్యూహం అదేనా!
Nara Bhuvaneswari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( ChandrababuNaidu ) సతీమణి, హెరిటేజ్సం ( Heritage )స్థ అధినేత్రి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari ) త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? 2029 ఎన్నికల్లో ఆమె కుప్పం ( Kuppam ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఆమె కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం, వరుస పర్యటనలతో ప్రజలకు మరింత దగ్గరవుతుండటం రాజకీయ విశ్లేషకుల్లో ఈ కొత్త అంచనాలకు బలాన్ని చేకూరుస్తోంది.
కుప్పంతో బలపడుతున్న అనుబంధం – ప్రజల్లో మమేకం
చంద్రబాబు నాయుడు పాలనా వ్యవహారాలతో నిరంతరం బిజీగా ఉంటుండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం బాధ్యతలను నారా భువనేశ్వరి స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అక్కడే సొంతిల్లు నిర్మించుకోవడమే కాకుండా, తరచూ పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధిని, కార్యకర్తలు మరియు స్థానిక నాయకుల బాగోగులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె వివిధ మండలాల్లో పర్యటించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించడం, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం, మొక్కలు నాటడంతో పాటు హార్టికల్చర్ హాబ్లను సందర్శించి నూతన సాగు విధానాలపై మహిళా రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. “కుప్పం ప్రజలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని ప్రకటిస్తూ ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని చాటుకుంటున్నారు.
నాటి అసెంబ్లీ ఘటనపై తీవ్ర భావోద్వేగం – సంచలన వ్యాఖ్యలు
పర్యటనలో భాగంగా ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. 2021 నవంబరులో నాటి అసెంబ్లీలో తనపై జరిగిన వ్యక్తిగత విమర్శలను గుర్తుచేసుకుంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “మహాభారతంలో ద్రౌపది భర్తను అవమానించేందుకు ఆమెను సభలోకి తెచ్చి చీర లాగినట్లే, చంద్రబాబు గారిని మానసికంగా దెబ్బతీయడానికే నాడు అసెంబ్లీలో నా పేరును లాగారు” అని విరుచుకుపడ్డారు. దమ్ముంటే పురుషులు నేరుగా పోరాడాలని, రాజకీయంలోకి ఒక స్త్రీని లాగకూడదని హితవు పలికారు. ప్రతి మహిళ తనను తాను రక్షించుకోగలదని స్పష్టం చేసిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
2029లో కుప్పం నుంచి పోటీ? – విశ్లేషకుల అంచనా
వరుస పర్యటనలు, పర్యాటక మరియు వ్యవసాయ రంగాలపై సమీక్షలు, మహిళలు-విద్యార్థులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే భువనేశ్వరి కేవలం క్షేత్రస్థాయి పరిశీలనకే పరిమితం కావడం లేదని స్పష్టమవుతోంది. వ్యాపార రంగంలో తన మార్కు సక్సెస్ చూపించిన ఆమె, ఇప్పుడు కుప్పంలో గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ నెట్వర్క్ను బలపరుస్తున్నారు. రాబోయే 2029 శాసనసభ ఎన్నికల్లో కుప్పం స్థానం నుంచి నారా భువనేశ్వరి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు త్వరలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి నాంది కానున్నాయని తెలుస్తోంది.
