రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన గీతం యూనివర్సిటీ!
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి గీతం యూనివర్సిటీ యాజమాన్యం గట్టి షాక్ ఇచ్చింది. యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆమెపై రూ. 5 కోట్ల రూపాయల భారీ పరువు నష్టం దావా వేసింది.
గీతం యూనివర్సిటీకి చెందిన స్థలంలో చేపట్టిన ఒక నిర్మాణ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, సత్యదూరమని వర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధి కోసమే విద్యాసంస్థపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. వరుదు కల్యాణి చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని భావించిన యాజమాన్యం న్యాయపోరాటానికి దిగింది. గీతం యూనివర్సిటీ తరపున న్యాయవాది టి. కనకరాజు ఈ పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గీతం యూనివర్సిటీపై వరుదు కల్యాణి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థ పరువుకు భంగం కలిగిస్తున్నారు. అందుకే ఆమెపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేశాం” అని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల నేపథ్యంలో గీతం యూనివర్సిటీ తీసుకున్న ఈ చట్టపరమైన నిర్ణయం ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
