The Tragic Untold Story of Veteran Actress Pavala Shyamala
ఇదేంటి ఒకరు చనిపోతే ఇలా కూడా అంటారా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును అనాల్సిందే.. ఎందుకంటే ఆమె జీవితం కష్టాల సావాసం. నా అనేవాళ్లు లేని అనాథ జీవితం.. తోడుంటానని బాస చేసిన భర్త మూడేళ్లకే లోకం వదిలిపోయాడు.. ఒక్క కూతురు ప్రమాదంలో మంచానికే పరిమితం… అంత వరకు అయితే సరేలే కష్టాలు సహజం అనుకోవచ్చు. కానీ బంధువులు రాబందులయ్యారు. మొఖానికి మేకప్ వేసుకుందని.. మొఖం మీద తలుపులు వేశారు. కాసిని డబ్బులు కనిపించగానే ఈగల్లా వాలిపోయారు. మళ్లీ కాస్త కష్టాలు కనిపించగానే.. వాళ్లు కనిపించకుండా పోయారు. చివరకు అనాథాశ్రమంలో బతుకీడుస్తూ.. పోరాడింది.. ఎన్నోసార్లు మరణాన్ని ఆహ్వానించింది.. కానీ విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు మరణంపై విజయం సాధించింది.. హమ్మయ్య అమె చనిపోయింది.. కాదు కాదు.. గెలిచింది.
ఇదంతా ఎవరి గురించో ఇంకా అర్థం కాలేదా.. వెండితెరపై ఎన్నో మరిచిపోలేని పాత్రలు వేసిన నటి పావలా శ్యామల (Pavala Syamala) గురించే.. వేషాల కోసం తెర ముందు పోరాటమే కాదు.. తెర వెనుక జీవితంతో పోరాడింది శ్యామల. పావలా శ్యామల జీవితం మొదటి నుంచీ కష్టాల సావాసమే. 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో (amaravati ) జన్మించిన ఆమెకు, నాటకాలపై ఉన్న ప్రాణంతో ‘పావలా’ నాటకం ద్వారా ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తండ్రి ఆంక్షల నడుమ 13 ఏళ్లకే వివాహం జరగగా, పట్టుమని మూడేళ్లు కూడా నిండకుండానే భర్త ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. చంటిపిల్ల అయిన కూతురు మాధవితో ఒంటరైన ఆమె, బతుకు దెరువు కోసం నాటక రంగాన్ని, ఆపై చిత్ర పరిశ్రమను నమ్ముకున్నారు. అయితే విధి అంతటితో ఊరుకోలేదు. చదువుకునే వయసులో కూతురు మేడపై నుంచి కిందపడటంతో నరం చిట్లి జ్ఞాపకశక్తి కోల్పోయి మంచానికే పరిమితమైంది. ఉన్న ఒక్క ఇంటినీ అమ్మేసి పాప వైద్యానికే ఆస్తులన్నీ ధారపోసినా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఒంటరి పోరాటంలో సమాజం, బంధువులు చూపించిన వైఖరి ఆమెను మానసికంగా మరింత కుంగదీసింది. నాటకాల్లోకి వచ్చిందనే నెపంతో బంధువులంతా ఆమెను వెలివేశారు. తీరా సినిమాల్లో కొద్దిగా సంపాదిస్తున్న రోజుల్లో రాబందుల్లా వాలిపోయి, మళ్లీ ఆర్థిక కష్టాలు రాగానే మొహం చాటేశారు. “మహిళ ఒంటరిగా ఉంటే ఈ సమాజం బతకనివ్వదు, పట్టుకుని పీడిస్తుంది” అని ఆమె కన్నీటితో చెప్పిన మాటలు సమాజపు నగ్నసత్యాన్ని చాటిచెబుతాయి. అద్దె కట్టలేక, కూతురి మందులకు డబ్బుల్లేక అనాథాశ్రమంలో బతుకీడుస్తూ, ‘నేను పోతే నా కూతురికి దిక్కు ఎవరు?’ అనే దిగులుతోనే ప్రతి క్షణం చస్తూ బతికారు.
44 ఏళ్ల పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించినప్పటికీ, జీవిత చరమాంకంలో ఆమెకు దక్కింది అవమానాలు, ఆకలి, ఆవేదన మాత్రమే. దిల్ రాజు (Dil Raju) , పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వంటి సినీ ప్రముఖులు, ప్రభుత్వ పెన్షన్ కొంత ఊరటనిచ్చినా, శారీరక, మానసిక క్షోభ నుంచి ఆమెకు పూర్తి విముక్తి లభించలేదు. ఎన్నోసార్లు మరణాన్ని ఆహ్వానించిన ఆమె, చివరకు ఆ మరణం పైనే విజయం సాధించి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. వెండితెరపై నవ్వుల వెనుక దాగివున్న ఒక నటి దీనగాథగా పావలా శ్యామల జీవితం మిగిలిపోతుంది.
Aishwarya Lekshmi: దాని కోసం నా డాగ్ ని వాడతానంటున్న కుస్తీ భామ..!