ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ‘ఆత్మహత్యాయత్నం’పై షాకింగ్ నిజాలు!
Trainee IPS Case: హైదరాబాద్లోని శివరాంపల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) వేదికగా చోటుచేసుకున్న తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి (Trainee IPS Uday Krishna Reddy) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ సోమవారం ఉదయం నుంచి జరిగిన ప్రచారంపై తాజాగా వైద్యులు, పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆయన శానిటైజర్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారన్న వార్తల్లో నిజం లేదని, అదంతా అతిగా మద్యం సేవించడం వల్ల జరిగిన పరిణామమేనని తేల్చిచెప్పారు.
అసలేం జరిగింది?
మహిళా ఐపీఎస్ ట్రైనీ ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై తీవ్రమైన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై భౌతికంగా దాడి చేసి, లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటికే విచారణ జరిపిన పోలీస్ అకాడమీ అధికారులు ఉదయ్ ని బయటకు పంపినట్టు సమాచారం. లైంగిక వేధింపుల కేసు నమోదైన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్పేట్లోని తన స్నేహితురాలి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఆయన ఆహారం తీసుకోకుండా అధికంగా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం ఎంత లేపినా స్పందించకపోవడంతో, గది వద్ద మద్యం సీసా, శానిటైజర్ కనిపించడంతో స్నేహితులు ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని భావించి హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక సూసైడ్ నోట్ కూడా వైరల్గా మారింది.
ఆసుపత్రి రిపోర్టులు ఏం చెబుతున్నాయి?
వైద్యులు ఉదయ్ కృష్ణారెడ్డి రక్త, మూత్ర నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపారు. ఆ నివేదికల్లో (Toxicology Reports) ఎలాంటి విషపూరిత పదార్థాలు లేదా డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని వైద్యులు స్పష్టం చేశారు. కేవలం శరీరంలో ఆల్కహాల్ (మద్యం) శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఆయన కోమా లాంటి అపస్మారక స్థితికి చేరుకున్నారని నిర్ధారించారు. సోమవారం మధ్యాహ్నానికి ఆయనకు స్పృహ వచ్చిందని, ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. ఈ రిపోర్టులతో తనపై నమోదైన కేసు నుంచి సానుభూతి పొందేందుకు ఆయన ఆత్మహత్య డ్రామా ఆడారనే ప్రచారం జోరందుకుంది.
వైరల్ సూసైడ్ నోట్.. ఇన్ స్టా పోస్టుల వెనుక కథ!
ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సోషల్ మీడియాలో కలకలం రేపింది. అందులో తను నిర్దోషినని, సదరు మహిళా ట్రైనీతో తనకు ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం ఉందని రాశారు. అకాడమీలోని మరో ఇద్దరు ట్రైనీ అధికారులు కావాలనే ఆమెను రెచ్చగొట్టి తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఆదివారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ “నాపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది, నిజమే గెలుస్తుంది” అని పోస్టు చేశారు.
మహిళా ఐపీఎస్ ట్రైనీ ఫిర్యాదులో ఉన్న షాకింగ్ నిజాలు
అత్తాపూర్ పోలీసులకు బాధితురాలు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్యంత భయంకరమైన ఆరోపణలు చేశారు.
- జూన్ 23 నుంచి వాట్సాప్లో లైంగికంగా వేధిస్తూ మెసేజ్లు పంపడం, అకాడమీలో తోటి మిత్రుల ముందు తెలుగులో అవమానకరంగా మాట్లాడటం చేశారు.
- తను మరో ట్రైనీతో సంబంధంలో ఉన్నానంటూ నిరాధారమైన నిందలు వేస్తూ, బలవంతంగా మొబైల్ పాస్వర్డ్ లాక్కుని వ్యక్తిగత మెసేజ్లు చూశారు.
- జూలై 9వ తేదీ రాత్రి తనను బలవంతంగా రూమ్లోకి లాక్కెళ్లి, జుట్టు పట్టుకుని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించడమే కాకుండా.. మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఆపై రూమ్లో మూడు కాండమ్ ప్యాకెట్లు విసిరేశారు.
- జూలై 8, 10 తేదీల్లో ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధించడమే కాకుండా, తన ప్రమేయం లేకుండా ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి, బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో వాటిని తన భర్తకు పంపించారని బాధితురాలు వాపోయింది.
నాడు స్ఫూర్తిదాయకం.. నేడు అధ:పాతాళానికి
ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణం ఒకప్పుడు ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఏపీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఉద్యోగానికి రాజీనామా చేశారు. పట్టుదలతో చదివి యూపీఎస్సీ (UPSC) ఫలితాల్లో సివిల్స్ క్రాక్ చేసి ఐపీఎస్ సాధించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఆయన ప్రయాణాన్ని చూసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం గతంలో స్వయంగా అభినందించారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకు రోల్ మోడల్గా నిలిచిన ఉదయ్.. ఇప్పుడు నేరుగా జాతీయ పోలీస్ అకాడమీలోనే తోటి మహిళా అధికారికే రక్షణ లేకుండా ప్రవర్తించారనే కేసులో ఇరుక్కోవడం వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తదుపరి చర్యలు ఏమిటి?
ఈ ఘటనపై జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ మరియు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అంతర్గత విచారణ కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ (MHA) ఉదయ్ కృష్ణారెడ్డిని ఐపీఎస్ శిక్షణ నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు అకాడమీలోని సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.