Arunachalam: పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మి అరుణాచలానికి పరుగులు తీస్తున్న తెలుగు భక్తులకు అక్కడి పరిస్థితులు తీవ్ర నిరాశను, భయాన్ని కలిగిస్తున్నాయి. “స్వామీ అరుణాచలేశ్వరా.. నీ సన్నిధికి వస్తున్నది ముక్తి కోసం! కానీ, ఇక్కడ మాకు ఎదురవుతున్నది మాత్రం నరకయాతన!” అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) (Tiruvannalmalai) ఇప్పుడు భక్తి పారవశ్యానికి నిలయంగా కాదు.. ఇతర రాష్ట్రాల, ముఖ్యంగా తెలుగు భక్తులపై స్థానిక రౌడీయిజం, దందాలు, దాడులకు అడ్డాగా మారుతోందనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇటీవల ఆక్రమణల తొలగింపు పేరుతో కేవలం తెలుగువాళ్లకు చెందిన అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన ఘటన కూడా తెలిసిందే. అరుణాచలంలో అరాచకాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి తెలంగాణకు చెందిన విద్యాసాగర్ అనే భక్తుడి దారుణ హత్యే నిదర్శనం. భక్తితో గిరిప్రదక్షిణ చేస్తున్న ఆ అభాగ్యుడిని స్థానిక ఆకతాయిలు బైక్తో ఢీకొట్టడమే కాకుండా, చిన్నపాటి గొడవను సాకుగా చూపి కత్తితో పొడిచి చంపేశారు. 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ మార్గంలో కొన్ని ప్రాంతాలు అటవీ సరిహద్దుల గుండా, చీకటి మయంగా సాగుతుండటంతో అర్ధరాత్రి వేళల్లో ప్రదక్షిణలు చేసే తెలుగు భక్తులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఆటోల నుంచి లాడ్జిల వరకు, పూజా సామగ్రి నుంచి నీళ్ల సీసాల వరకు తెలుగువారు కనిపిస్తే చాలు.. “ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే!” అని బెదిరిస్తున్నారు. కాదంటే దుర్భాషలాడుతూ, భౌతిక దాడులకు తెగబడుతున్నారు.
ఒకవైపు భక్తులపై దాడులు జరుగుతుంటే, మరోవైపు అక్కడున్న తెలుగువారి స్వచ్ఛంద వ్యవస్థలపై కక్షసాధింపు చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఎంతో కాలంగా ఆకలి తీరుస్తున్న తెలుగువారి అన్నదాన సత్రాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక మోక్షమార్గం (ఇడుక్కు పిళ్లైయార్) వద్ద అధికారుల నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తోంది. సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కొద్దిరోజుల క్రితం ఒక తెలుగు భక్తుడు ఆ గుహ రంధ్రంలో ఇరుక్కుపోయి మరణించగా, నిన్న మరో తెలుగు భక్తురాలు ఇరుక్కుపోతే ఇతర భక్తులు సాహసించి రక్షించారు. వరుస ప్రమాదాల తర్వాత ఇప్పుడు కొత్తగా మూడు భాషల్లో బోర్డులు పెట్టారు కానీ, పోయిన ప్రాణాలను ఎవరు తెచ్చిస్తారు?
ఈ దాడులు, ప్రమాదాలు చాలవన్నట్లు సోషల్ మీడియా (Social Media) వేదికగా తమిళ నెటిజన్లు తెలుగువారిపై కక్కుతున్న విషం అంతా ఇంతా కాదు. “తెలివి లేని పనులు చేసేది కేవలం తెలుగువాళ్లే!” అంటూ హేళన చేస్తూ పిచ్చి పోస్టులు పెడుతున్నారు. ప్రమాదాలు జరిగినా సానుభూతి చూపాల్సింది పోయి, తెలుగు భక్తుల సంస్కృతిని అవమానిస్తూ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని తమిళనాడు టూరిజానికి కట్టబెడుతున్నది తెలుగు భక్తులేనని గుర్తించి, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరియు తెలంగాణ (Telangana) ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. తమిళనాడు సర్కార్తో మాట్లాడి గిరిప్రదక్షిణ మార్గంలో ప్రత్యేక పోలీస్ అవుట్పోస్టులు, తెలుగు హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయించి, రౌడీయిజం చేసే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.