bondi beach Saviour hyderabadi hero rahmat pasha gets australian residency
విధి ఎంత విచిత్రమైనది! ఒకే నగరంలో వేర్లు తొడిగిన ఇద్దరు వ్యక్తులు.. ఒకే సంఘటనలో రెండు వేర్వేరు ధృవాలుగా నిలిచారు. ఒకడు విధ్వంసం సృష్టించి మానవత్వానికి మచ్చ తెస్తే.. మరొకరు ప్రాణాలను పణంగా పెట్టి ఆ మానవత్వాన్ని గెలిపించారు. ఆస్ట్రేలియా (australia) లోని సిడ్నీ నగరం బాండీ బీచ్ (Bondi Beach) లో గతేడాది డిసెంబర్ 14న జరిగిన నరమేధం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ ఆ చీకటి ఘటన వెనుక హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన ఇద్దరి పేర్లు వినపడటం.. కాలం విసిరిన విచిత్రమైన సైకలాజికల్ డ్రామా!
వెలుగుల నేల నుంచి చీకటి వైపు ఒకడు..
సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రీకొడుకులు హైదరాబాద్లోనే పుట్టి పెరిగినా, మంచి మార్గాన్ని వదిలి మతోన్మాదం, తీవ్రవాదమనే వినాశకరమైన దారిని ఎంచుకున్నారు. పాకిస్తాన్ మీదుగా ఆస్ట్రేలియా చేరిన ఈ తండ్రీకొడుకులు తమ మనసుల్లో విషాన్ని నింపుకున్నారు. యూదుల ‘హనుక్కా’ (Hanukka) పండుగ వేళ, పర్యాటకులతో కళకళలాడుతున్న బాండీ బీచ్లో 50 రౌండ్లకు పైగా విచక్షణారహితంగా కాల్పులు జరిపి 15 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు. తీవ్రవాదం ఎప్పుడూ రక్తాన్ని, నాశనాన్నే మిగులుస్తుంది. ఫలితంగా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో తండ్రి సాజిద్ అక్కడికక్కడే కుప్పకూలి శవంగా మారగా, కొడుకు నవీద్ గాయపడి నేడు జైలు గోడల మధ్య నరకం అనుభవిస్తున్నాడు.
ఇది చదివారా..? AI తో మెదడుకు మతిమరుపు
అదే బీచ్లో, అదే తూటాల వర్షం కురుస్తున్న వేళ.. మరో హైదరాబాదీ రెహ్మత్ పాషా (rehmat pasha) నిలబడ్డాడు. తూటాల శబ్దాలకు జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటే, పాషా మాత్రం వెనుకంజ వేయలేదు. తన ప్రాణాలను లెక్కచేయకుండా, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దాదాపు 20 మందిని అంబులెన్స్ల వద్దకు చేర్చి పునర్జన్మనిచ్చాడు. ఒక సాదాసీదా క్యాబ్ డ్రైవర్లో ఉన్న ‘మనుషుల పట్ల ప్రేమ’ ఆయనను ఒక మహానాయకుడిని చేసింది.
మంచిని నమ్మినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రెహ్మత్ పాషా తెగువను మెచ్చి శాశ్వత నివాస హోదా (PR) కల్పించింది. ఆయన ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించడమే కాక, పౌర పురస్కారాలకు నామినేట్ చేసింది.
మనం నేర్చుకోవాల్సిన పాఠం
“విషపు గాలిని పీల్చినవాడు రాక్షసుడయ్యాడు.. ప్రేమ అనే సుగంధాన్ని పంచినవాడు రక్షకుడయ్యాడు.” హైదరాబాద్ అనే ఒకే నేలలో పుట్టినా.. ఒకరు ఉగ్రవాదం, ద్వేషం అనే నాశనపు మార్గాన్ని ఎంచుకుని సమాజానికి శాపంగా మారారు. మరొకరు కరుణ, ధైర్యం అనే సన్మార్గాన్ని నమ్మి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.
ఈ ఘటన ప్రపంచానికి ఒకటే స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. తీవ్రవాదం, అసహనం అనేవి మనుషులను పాతాళానికి తొక్కి వినాశనానికి దారితీస్తాయి. కానీ మంచి, మానవత్వం, ధైర్యం అనేవి ఎక్కడ ఉన్నా సరే.. ఒక సామాన్యుడిని సైతం విశ్వవిజేతగా నిలబెడతాయి!
ఇది చదివారా..? రెంటింగ్ ఎకానమీ గురించి తెలియకపోతే మీరు ఔట్ డేటెడ్ అయిపోయినట్టే..!
