కాలేజీల్లో హెచ్ఐవీ టెస్టులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
యువతలో స్పీడ్గా పెరుగుతున్న హెచ్ఐవీ!
Karnataka: కర్ణాటకలో హెచ్ఐవీ (HIV) వ్యాప్తి భయంకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా కాలేజీ కెళ్లే కుర్రాళ్లలోనే ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుండటం పెద్ద కలకలం రేపుతోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. కర్ణాటకలో మొత్తం 2.60 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. కానీ అందులో కేవలం 2.05 లక్షల మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాదాపు 54,000 మందికి అసలు తమకు ఈ వైరస్ ఉందనే విషయమే తెలీదు!
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న కుర్రాళ్లలోనే ఇది చాలా వేగంగా వ్యాపిస్తోంది. 2023-24లో ఈ ఏజ్ గ్రూప్లో 44,500 మంది బాధితులు ఉంటే.. 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 66,600కి చేరింది. ఇటీవల జరిపిన మెడికల్ చెకప్స్లో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న ఏకంగా 7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది! దాంతో హెల్త్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ తిన్నాయి. చదువుకునే వయసులోనే విద్యార్థులు ఇలాంటి డేంజర్ జోన్లో పడిపోవడంతో వెంటనే రంగంలోకి దిగాయి.
కాలేజీల్లో హెచ్ఐవీ టెస్టులు ఖచ్చితంగా చేయాల్సిందే!
ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో స్టూడెంట్లకు హెచ్ఐవీ టెస్టులు, కౌన్సెలింగ్ క్యాంపులు పెట్టడం తప్పనిసరి అని ఆర్డర్స్ ఇచ్చేసింది. యూనివర్సిటీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో రెగ్యులర్గా కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తారు. అయితే ఈ టెస్టులు కేవలం విద్యార్థుల పర్మిషన్ (Consent) తీసుకున్నాకే చేస్తామని స్పష్టం చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. పూర్తి వివరాలు!
విద్యార్థులకు హెచ్ఐవీపై అవగాహన పెంచేందుకు ‘QR కోడ్’ సిస్టమ్ను కూడా తెచ్చారు. ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. దగ్గరలో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలన్నీ వివరంగా తెలిసిపోతాయి. అసలు వ్యాధి ఎలా వస్తుంది? దాన్ని ఎలా అడ్డుకోవాలి? అనే విషయాలు స్టూడెంట్స్కి ముందే తెలిస్తే.. ఈ వైరస్ వ్యాప్తికి బ్రేకులు వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.