Palnadu District: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షకుడు మరియు మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు నరసరావుపేటలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్థానిక అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల ముఖ్యఅతిథిగా పాల్గొని మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ— “మండలి వెంకటకృష్ణారావు గారు తెలుగు భాష, సంస్కృతి, విద్యారంగాల వికాసానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యాశాఖ మంత్రిగా సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ఆశయాలను, తెలుగు భాషా పరిరక్షణకు ఆయన చేసిన కృషిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
తెలుగు భాషా వికాసానికి, సాంస్కృతిక వైభవానికి మండలి వెంకటకృష్ణారావు గారు అందించిన విశేష సేవలను గౌరవిస్తూ, ఆయన శత జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) అద్దయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రామరావు, టూరిజం అధికారి నాయుడమ్మ తదితరులు పాల్గొని మండలి వెంకటకృష్ణారావు సేవలను స్మరించుకున్నారు.