Palnadu District: నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి స్థానిక నాయకుల మధ్య పోటీ ఇప్పుడే తారాస్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కానీ, స్థానాల రిజర్వేషన్ల ప్రకటన కానీ ఇంకా వెలువడలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు తామే కాబోయే చైర్మన్ అంటూ ఊదరగొడుతున్నారు.
టీ కొట్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకటే చర్చ
పల్నాడు జిల్లాలోని కీలకమైన నరసరావుపేట మున్సిపాలిటీలో ( Narasaraopet Municipality ) ప్రస్తుతం ఎక్కడ చూసినా చైర్మన్ పదవి గురించే చర్చ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అధికారిక స్పష్టత లేకపోయినప్పటికీ, గల్లీకో నాయకుడు, వార్డుకో లీడర్ తామే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హంగామా సృష్టిస్తున్నారు. టీ కొట్ల వద్ద మొదలుకొని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల వరకు ఈ “సెల్ఫ్” ప్రచారాలే కనిపిస్తున్నాయి.
రిజర్వేషన్లు తేలకుండానే సొంత డబ్బాలు
ఎంతో చరిత్ర, పేరు ప్రఖ్యాతులు ఉన్న నరసరావుపేట మున్సిపాలిటీకి గతంలో పలువురు ప్రముఖులు చైర్మన్లుగా సేవలందించారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన పదవిని దక్కించుకోవడానికి అప్పుడే ఆరాటం మొదలైంది. అసలు ఈసారి చైర్మన్ సీటు మహిళకు కేటాయిస్తారా? లేక జనరల్కి ఇస్తారా? ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయినా సరే, “నేనే కాబోయే చైర్మన్” అంటూ ఎవరికివారే సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు.
ఎమ్మెల్యే నిర్ణయమే ఆఖరిది!
పార్టీల పరంగా, కుల ప్రాతిపదికన తమకే పీఠం దక్కుతుందంటూ కొందరు నేతలు సీనియర్ నాయకుల ఫొటోలతో డిజైన్ చేసిన పోస్టులను వైరల్ చేస్తున్నారు. అయితే, అభ్యర్థి ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయం, పార్టీ అధిష్టానం నిర్ణయమే ఆఖరిది అనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తుండడంపై స్థానికులు నవ్వుకుంటున్నారు.
కేవలం సోషల్ మీడియా ప్రచారాలతో చైర్మన్ సీటు దక్కదని, పోటీలో నిలవాలంటే అర్థ బలం, అంగ బలం, ప్రజల్లో నైతిక బలం ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.