ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. హైడ్రా చర్యలతో పార్కులు, చెరువులు పునరుద్ధరణకు నోచుకుని తమ కాలనీలకు జీవం పోశాయని హర్షం వ్యక్తం చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో టపాసులు పేల్చి కేరింతలు కొట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్న నగరవాసులు ఎన్టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి భవిష్యత్తునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా ఏకంగా మూడు వేల మూడు వందల పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, దీని విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు ఉంటుందని ర్యాలీలో పాల్గొన్న వారు అభినందించారు. ప్రాణవాయువును అందించే పార్కులు, వరదలను కట్టడి చేసే చెరువుల రూపంలో చూస్తే హైడ్రా కాపాడిన ఆస్తుల విలువ అనంతమని వారు కీర్తించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన హైడ్రాను కేవలం నగరానికే పరిమితం చేయకుండా, జిల్లాలకు సైతం విస్తరించి అక్కడి చెరువులు, ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సచివాలయంలో పలువురు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.